- December 24, 2021
WWW Movie Review : ‘డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు’ మూవీ రివ్యూ.. కొత్త అనుభూతి
118 వంటి సూపర్హిట్ మూవీ తర్వాత ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వం వహించిన చిత్రం “WWW”(ఎవరు, ఎక్కడ, ఎందుకు). అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా రామంత్ర క్రియేషన్స్ పతాకంపై డా.రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ సమర్పకులుగా వ్యవహరించారు. ఇప్పటికే విడుదలైన టీజర్,ట్రైలర్, పాటలు ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. తెలుగులో వస్తున్న ఫస్ట్ కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీ కావడం, డి. సురేష్ బాబు, దిల్రాజు లాంటి అగ్ర నిర్మాతలు ఈ సినిమాకు సపోర్ట్ చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుత పరిస్థితుల దృశ్యా ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్కి వెళ్లింది. ఈ రోజు నుంచి (డిసెంబరు24) సోనిలీవ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
విశ్వ(అదిత్ అరుణ్), అష్రఫ్(ప్రియదర్శి), సదా సత్యం (రాజేష్), చిష్ట్రీ(దివ్య శ్రీపాద) నలుగురు మంచి స్నేహితులు, సాఫ్ట్ వేర్ టెకీలు. వీరంతా వేరు వేరు నగరాల్లో ఉంటూ కంప్యూటర్ లో నే వర్చువల్ గా మాట్లాడుకుంటూ సరదాగా చిల్ అవుతూ వుంటారు. చిష్ట్రీ కి మిత్ర(శివాని రాజశేఖర్) మంచి ఫ్రెండ్. చిష్ట్రీ ద్వారా విశ్వకి మిత్ర పరిచయమవుతుంది. ఒక సారి మిత్ర ఫ్యామిలీకి.. విశ్వ హెల్ప్ చేస్తాడు. దాంతో ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారుతుంది. మిత్ర ఒక రోజు చిష్ట్రీ ఇంటికి వెళుతుంది. అయితే ఉన్నట్టుండి కరోన కారణంగా రాత్రికి రాత్రే సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తారు. దాంతో మిత్ర అక్కడే లాక్ అయిపోతుంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి (సందీప్, కిల్లింగ్ వీరప్పన్ ఫేమ్) ఫ్లాట్ లోకి చొరబడి.. చిష్ట్రీని విచక్షణా రహితంగా పొడిచేసి గాయాపరుస్తాడు. మిత్రను కూడా దారుణంగా చంపేస్తా అంటూ చిత్రహింసలకు గురిచేస్తాడు. దీన్ని వర్చువల్గా చూసిన విశ్వ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు. ఆమె బతకాలంటే నువ్వు ఉరేసుకుని చస్తే… మిత్రను వదిలేస్తా అంటాడు. అసలు ఆ వ్యక్తి ఎవరు?, విశ్వని ఎందుకు ఉరివేసుకుని చావమన్నాడు. ఆ వ్యక్తి నుండి విశ్వ మిత్ర, చిష్ట్రిలను కాపాడాడా లేదా అనేది మిగతా సినిమా కథ..
సమకాలీన ప్రపంచంలో కంప్యూటర్ టెకీలు ఎలా తమకున్నటాలెంట్ ని దుర్వినియోగం చేసి… విలాసవంతమైన లైఫ్ కి అలవాటు పడి.. సమాజంలో ఎలా దోషులుగా మారుతున్నారనేదాన్ని తల్లిదండ్రులకు తెలిసేలా ఓ మంచి మెసేజ్ ఇచ్చాడు గుహన్. ఫస్ట్ టైమ్ కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రం… రెండు కంప్యూటర్ల స్క్రీన్ మీదనే సినిమా మొత్తం రన్ కావడం సూపర్ థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఇలాంటి స్టోరీ ఐడియా దర్శకుడికి రావడమే నిజంగా అభినందిచాల్సిన విషయం. ఎంతో ఎగ్జైటింగ్ అనిపించే ఇలాంటి కథలను అనుకున్న బడ్జెట్ లోనే తెరమీద రిచ్ గా చూపించొచ్చని గుహన్ నిరూపించారు. థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు.
ఇక పెర్ఫామెన్స్ల విషయానికి వస్తే ఇందులో ఇల్లీగల్ హ్యాకర్ హెడ్గా నటించిన అదిత్ అరుణ్… మరోసారి తన మార్క్ స్టయిలిష్ నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా చావుబతుకుల కొట్టుమిట్టాడే ప్రియురాలిని ఎలా కాపాడుకోవాలో తెలియక బాధపడే పాత్రలో చక్కగా నటించాడు. అతనికి జంటగా నటించిన శివాని రాజశేఖర్ అదరగొట్టేసింది. సినిమా అంతా కంప్యూటర్ స్క్రీన్ మీదనే నడుస్తున్నప్పటికీ ప్రతి ఎక్స్ప్రెషన్ ఆడియన్స్ క్యాచ్ చేసే విధంగా ఎంతో అనుభవమున్న నటి అనేలా నటించింది. సాంగ్స్లో చాలా క్యూట్ గా కనిపించింది. ఇక ప్రియదర్శి, దివ్య, సత్యం రాజేష్ వారి పాత్రలకు తగ్గట్టు చేశారు. కిల్లింగ్ వీరప్పన్ ఫేమ్ సందీప్ కూడా ఉన్న కాసేపు అయినా భయపెట్టి.. ప్రేక్షకులను అసలు సిసలు థ్రిల్ ను పరిచయం చేశాడు. వైవా హర్ష… తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. రియాజ్ ఖాన్ సైబర్ క్రైమ్ పోలీసు అధికారి గా కనిపించి మెప్పించారు.
సాంకేతిక విలువల విషయానికి వస్తే ఈ చిత్రానికి గుహన్ మేకింగ్ తో పాటు సినిమాటోగ్రఫి కూడా చాలా ప్లస్ అయింది. కొన్ని సన్నివేశాల్లో విజువల్స్ గూజ్బమ్స్ తెప్పించేలా ఉన్నాయి. తర్వాత మాట్లాడుకోవాల్సింది సైమన్ కె. కింగ్ సంగీతం, నేపథ్య సంగీతం గురించి.. కథ ఎక్కడా డీవియేట్ కాకుండా తన బీజియమ్తో ఆకట్టుకుంటూనే పాటలతో ప్రేక్షకుల్ని ఆశ్యర్యపరిచాడు. అన్ని పాటలు స్క్రీన్ మీద ప్లజెంట్గా ప్రొజెక్ట్ చేయబడ్డాయి. తమ్మిరాజు క్రిస్పి ఎడిటింగ్ బాగుంది..ఇక రామంత్ర క్రియేషన్స్ నిర్మాణ విలువల్ని తప్పకుండా మెచ్చుకోవాల్సిందే..ఈ కథను కేవలం ఆన్లైన్లోనే విని మొదటిసినిమాగా ఒక డిఫరెంట్ చిత్రాన్ని ఎంచుకోవడం గొప్ప విషయం. ఖర్చుకి ఎక్కడా వెనకాడకుండా కథకు తగ్గ నటీనటుల్ని సాంకేతిక వర్గాన్ని ఎంపికచేసుకోవడంతోనే ఈ టీమ్ సక్సెస్ సాధించింది. రెగ్యులర్ సినిమాలు కాకుండా కథాబలం ఉన్న చిత్రాలు, సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఈ సినిమా మరింత బాగ నచ్చే అవకాశం ఉంది.
రేటింగ్ 2.5