• July 12, 2024

అమెరికాలోని సియాటిల్‌లో టీజీ విశ్వ ప్రసాద్‌ను ఘనంగా స్వాగతించిన జనసైనికులు

అమెరికాలోని సియాటిల్‌లో టీజీ విశ్వ ప్రసాద్‌ను ఘనంగా స్వాగతించిన జనసైనికులు

    విభిన్న తరహా చిత్రాలను రూపొందించి పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న విజనరీ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రితో ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. సినిమాల పరంగానే కాకుండా, వ్యక్తిగతంగానూ పవన్ కళ్యాణ్‌తో టిజి విశ్వ ప్రసాద్‌కు మంచి సాన్నిహిత్య బంధం ఉంది. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్‌కు మద్దతునిచ్చిన పరిశ్రమలోని మొదటి వ్యక్తులలో ఆయన ఒకరు. NDA కూటమి విజయాన్ని సంబరాలు చేసుకున్న మొదటి వ్యక్తి కూడా ఆయనే.

    2018లో జనసేన పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన దగ్గరనుంచి, జనసేన ప్రవాస గర్జన సందర్భంగా పవన్ కళ్యాణ్‌తో పాటు టీజీ విశ్వ ప్రసాద్ 2024 ఎన్నికల్లో పార్టీ విజయంలో కీలకపాత్ర పోషించారు. కాగా, ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా అమెరికాలోని సియాటిల్‌కు వచ్చిన టీజీ విశ్వప్రసాద్‌కు విమానాశ్రయంలో జనసేన మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు. సియాటిల్‌లోని శ్రీదేవి ఫంక్షన్‌ హాల్‌లో ఆయనను ఘనంగా సత్కరించారు.

    ఈ సందర్భంగా విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ..‘పటిష్టమైన సమన్వయం వల్లే కుటమి ఎన్నికల్లో విజయం సాధించింది. తెలుగుదేశం, జనసేన మద్దతుదారులు ఒకే స్ఫూర్తితో, ఆత్మీయతతో కలిసి పనిచేయాలి’ అని అన్నారు.

    సియాటిల్ జనసేన మద్దతుదారులు సుంకరి శ్రీరామ్, శ్రీకాంత్ మొగరాల, సుహాగ్ గండికోట, వినోద్ పర్ణ, రామ్ కొట్టి, తెలుగుదేశం మద్దతుదారులు మనోజ్ లింగ, రామకృష్ణ, టిజి విశ్వప్రసాద్‌ను ఘనంగా సత్కరించారు.