- August 10, 2025
‘మోస్ట్ డిజైరబుల్ (మేల్)’ అవార్డును గెలుచుకున్న సాయి దుర్గ తేజ్

యూజెనిక్స్ ఫిల్మ్ఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్ సౌత్ 2025 కార్యక్రమంలో శనివారం (ఆగస్ట్ 9) హైదరాబాద్లోని పార్క్ హయత్లో జరిగింది. మొట్టమొదటి సారిగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు చెందిన కొంతమంది ప్రముఖులు కలిసి సందడి చేశారు. ఈ క్రమంలో సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ మోస్ట్ డిజైరబుల్ (మేల్) అవార్డును గెలుచుకున్నారు.
ఈ అవార్డును సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ప్రదానం చేశారు. ఈ అవార్డుని తల్లి విజయ దుర్గ, తండ్రి డాక్టర్ శివ ప్రసాద్ చేతుల మీదుగా తీసుకోవాలని సాయి దుర్గ తేజ్ కోరుకున్నారు. ఇక వేదికపైనే ఈ అవార్డుని, గౌరవాన్ని సాయి దుర్గ తేజ్ తన తల్లికి అంకితం చేశారు. రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో తనను తల్లి కంటికి రెప్పలా కాపాడుకున్నారని గుర్తు చేసుకున్నారు. ‘నేను అంతా కోల్పోయానని అనుకున్నప్పుడు, నా తల్లి నాకు అండగా నిలిచి ధైర్యం చెప్పారు. ఆమె నా ఆత్మవిశ్వాసాన్ని పెంచి నన్ను సాధారణ స్థితికి తీసుకువచ్చారు’ అని అన్నారు.
‘కంఫర్టబుల్గా ఉండే దుస్తుల్ని ధరించండి. ప్రశాంతంగా, సంతోషంగా, ఉండండి’ అని ఆయన అన్నారు. తన స్టైల్ ఐకాన్లను పేర్కొంటూ రామ్ చరణ్, పవన్ కళ్యాణ్లను ఎంచుకున్నారు. ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ లుక్స్ తన ఆల్ టైం ఫేవరేట్ స్టైల్, లుక్స్ అని సాయి దుర్గ తేజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో.. నాని, అడివి శేష్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, మాళవిక మోహనన్, తేజ సజ్జ, అనిల్ రావిపూడి, నాగ వంశీ, ప్రగ్యా జైస్వాల్, రాశి ఖన్నా, మంచు లక్ష్మి, భాగ్యశ్రీ బోర్సే, అదితి రావు హైదరి, సిద్ధార్థ్, చిన్మయి శ్రీపాద, దేవి శ్రీ ప్రసాద్ వంటి అనేక మంది ప్రముఖ సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం రోహిత్ కెపి దర్శకత్వంలో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా హై-బడ్జెట్ యాక్షన్ డ్రామా సంబరాల ఏటి గట్టు (SYG) చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా 2025 చివరిలో విడుదల కానుంది.