- November 16, 2021
సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఇంట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం నుంచి ఇంకా అభిమానులు కోలుకోనేలేదు. సుశాంత్ మరణించి ఏడాదిన్నరకు పైగానే అయింది. కానీ ఇంకా కళ్ల ముందే ఉన్నట్టుంది. అలాంటి సుశాంత్ ఇంట్లో నేడు ఘోర విషాదం నెలకొంది. ఆయన కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. బీహార్లోని లఖిసరాయ్ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సుశాంత్ కుటుంబానికి చెందిన ఐదుగురుతో పాటు డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది.
సుశాంత్ బంధువు ఓం ప్రకాశ్ సింగ్ సోదరి అంత్యక్రియలకు హాజరైన అనంతరం పాట్నా నుంచి జమూయి పట్టణానికి తిరిగి వస్తుండగా లఖిసరాయ్ జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. వారు ప్రయాణిస్తున్న టాటా సుమో.. ఎదురుగా వస్తున్న ట్రక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమో నుజ్జునుజ్జుయింది. సుమోలో మొత్తం 10 మంది ఉన్నారట. వారిలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. మరణించిన వారంతా సుశాంత్ సింగ్ రాజ్పుత్ బావ, హర్యానా కేడర్ ఐపీఎస్ ఆఫీసర్ ఓం ప్రకాశ్ సింగ్ సమీప బంధువులేనట.
ప్రమాదంలో మరణించిన వారిని లలిత్ సింగ్, ఆయన ఇద్దరు కుమారులు అమిత్ శేఖర్, రామ్ చంద్ర సింగ్, కుమార్తె బేబీ దేవి, మేనకోడలు అనితా దేవి, డ్రైవర్ ప్రీతమ్ కుమార్గా పోలీసులు గుర్తించారు. లలిత్ సింగ్.. హర్యానాలో సీనియర్ పోలీస్ ఆఫీసర్ అయిన ఓం ప్రకాస్ సింగ్ బావమరిది. ఓం ప్రకాష్ సింగ్.. సుశాంత్ సింగ్ రాజ్పుత్ బావ. ఓం ప్రకాష్ సింగ్ సోదరి గీతా దేవి అంత్యక్రియల్లో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.