టాలీవుడ్, ఏపీ ప్రభుత్వం మధ్య సఖ్యతను కుదిర్చేందుకు, ఇన్ని రోజులుగా నడుస్తున్న వివాదాలకు పుల్ స్టాప్ పెట్టే విధంగా సీఎం జగన్, చిరంజీవి భేటీ జరిగిందని తెలుస్తోంది. టికెట్ రేట్ల వివాదంపై ఓ ముగింపు వచ్చేలా ఉందని పరిస్థితి చూస్తే అర్థమవుతోంది. నేడు సీఎం జగన్తో చిరంజీవి భేటి సారాంశం అదే చెబుతోంది. సీఎంతో ముచ్చటించిన అనంతరం ఆ విశేషాలు మీడియాతో చిరంజీవి పంచుకున్నారు.
సీఎం జగన్తో సమావేశం చాలా సంతృప్తిగా జరిగిందని చిరు అన్నారు. పండుగనాడు ఓ సోదరుడిలా ఆహ్వానించి విందు ఇచ్చారన్నారు. కొన్ని నెలలుగా సినిమా ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య తర్జనభర్జనలు నెలకొన్నాయన్నారు. సమస్యల పరిష్కారానికి విధివిధానాలు ఖరారు చేసి తుది నిర్ణయం తీసుకుంటామని జగన్ అన్నారు. సామాన్య ప్రజలకు వినోదం అందుబాటులో ఉండాలన్న సీఎం ప్రయత్నాన్ని అభినందిస్తున్నానని అన్నారు. అలాగే ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఇండస్ట్రీ ఎదుర్కొనే పరిస్థితులను జగన్కు వివరించాను.
సినిమా ఇండస్ట్రీ బయటకు కనిపించేంత రోజీ కలర్ కాదని, ఇండస్ట్రీలోని కార్మికులకు రెక్కడాతేగానీ డొక్కాడని పరిస్థితి ఉందని తెలిపాను. అలాంటి పేద కార్మికులకు ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. థియేటర్ల యాజమాన్యాలకు కూడా ధైర్యం కల్పించాల్సిన అవసరముందని అన్నారు. ఈ సమస్యలపై తాను చేసిన నిర్మాణాత్మక సూచనలపై సీఎం సానుకూలంగా స్పందించారు.
అందరికీ అమోద యోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని ఎవ్వరూ భయపడొద్దని జగన్ భరోసా ఇచ్చారు. సినిమా టికెట్ల ధరలపై వస్తున్న అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని జీవోలు మార్పులు చేసే విధంగా నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అప్పటి వరకు సినిమా రంగంలోని వ్యక్తులు సంయమని పాటించాలని కోరుతున్నాను. ఈ వ్యాఖ్యలు పెద్దగా కాదు బిడ్డగా చెబుతున్నాను. ఎవరికి వారు ఇష్టమొచ్చినట్టుగా వ్యాఖ్యలు చేయకండని కోరుతున్నాను. చిన్న సినిమాలకు సంబంధించిన ఐదో షో ఉండాలనే విషయానికి సానుకూలంగా స్పందించారు.
సీఎం జగన్ తన ఒక్కడినే ఆహ్వానించినందుకే ఒక్కడినే వచ్చాను. ఆయన వంద మందితో రమ్మంటే వంద మంది వస్తాం. కానీ ఆయన నన్ను ఒక్కరినే భోజనానికి రమ్మన్నారు. అందుకే ఇలా ఒక్కడినే వచ్చాను. టికెట్ ధరలు తగ్గిస్తారా? పెంచుతారా? అనేది తెలియదు గానీ అందరికీ ఆమోద యోగ్యంగా ఉంటుంది. అది వారంలో వస్తుందా? పది రోజుల్లో జీవో వస్తుందా? అన్నది చెప్పలేను. కానీ అత్యంత త్వరలో వస్తుంది.
రెండు పక్షాల వాదనలు విని నిర్ణయం తీసుకుంటాను అని జగన్ అన్నారు. ఆయన పలకరించిన తీరు, భరోసానిచ్చిన విధానం ఎంతో సంతృప్తినిచ్చింది. భారతి గారు దగ్గరుండి వడ్డించడం ఎంతో సంతోషంగా అనిపించింది. ఇంత ఆప్యాయతను కనబరిచిన ఆ ఇద్దరికి హృదయపూర్వక ధన్యవాదాలు అని చిరంజీవి తెలిపారు.